ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. చీరాలలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఆమంచి త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బుజ్జగింపులు ఫలించలేదు చంద్రబాబు భరోసా పనిచేయలేదు చివరికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఆమంచి కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు ఆమంచి తెలిపారు. ఒంగోలులో జరగనున్న వైసీసీ సమర శంఖారావంలో అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు.
ఆమంచి రాకపై చీరాల వైసీపీలో చిచ్చు రేగింది. ఆమంచి అనుచరులు, అనుకూల వర్గం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటే, చీరాల వైసీపీ నేత యడం బాలాజీ వర్గీయులు ఆమంచికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక టీడీపీ శ్రేణులు కూడా ఆమంచికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. చీరాలలో తెలుగుదేశానికి పట్టిన పీడ విరగడైందంటూ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఆమంచి రాజీనామాతో చీరాల బాధ్యతలను కరణం బలరామ్కు చంద్రబాబు అప్పగించారు. చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని బలరామ్ను ఆదేశించారు.