మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుట్రలు భరించలేకే వైసీపీలో చేరినట్టు ఆదాల ప్రభాకర్ తెలిపారు. టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న సమయంలో మంత్రి సోమిరెడ్డి తనపై కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్తో వచ్చిన మాజీ మంత్రి ఆదాలకు ఆయన అభిమానులు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రైళ్లో నెల్లూరు చేరుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని తన నివాసం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు అనుచరులు, కార్యకర్తలు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి దాదాపు అరగంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఇద్దరూ కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామంటూ ప్రకటించారు.