కొందరికి ఒకే పనిమీద ధ్యాస. తాము చేస్తున్న ఉద్యోగాన్నే ప్రేమించి ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటారు. కానీ మరికొందరు మాత్రం చేస్తున్న ఉద్యోగంతో పాటు మరేదైన రంగంలో రాణించాలనుకుంటారు. అలాంటి కోవకి చెందిన ఓ వ్యక్తి అందర్నీ ఆకట్టుకునేలా అద్భుతమైన కళను ప్రదర్శించాడు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో నివశించే ఇతని పేరు గుర్రం దయాకర్. వృత్తి రీత్యా ఇంజినీర్. కానీ ఇతని ప్రవృత్తి మైక్రో ఆర్ట్. కంటికి కనిపించనంత చిన్న వస్తువులను తయారు చేయడం దయాకర్ స్పెషల్. నిలువెత్తు బొమ్మలను తయారు చేసే వాళ్లు అనేకమంది. కానీ అతి సూక్ష్మంగా బొమ్మలను చెక్కేవారు కాస్త తక్కువనే చెప్పుకోవాలి. స్థానిక తులసీనగర్లో నివాసముండే దయాకర్ ఇప్పటికే అనేక చిన్న బొమ్మలను రూపొందించాడు.
పరమేశ్వరుడి సూక్ష్మ రూపాన్ని సూది బెజ్జంలో రూపొందించాడు దయాకర్. బట్టలు కుట్టే సూది బెజ్జంలో 22 క్యారెట్ల బంగారంతో 24 మిల్లీ గ్రాముల బరువు గల సాయి బాబా విగ్రహం తయారు చేశాడు. గణపతి రూపాన్ని ఆవగింజ పరిమాణంలో రూపొందించాడు. 22 క్యారెట్ల బంగారంతో 20 మిల్లీ గ్రాముల బంగారంతో గణేష్ని చూడ ముచ్చటగా కనిపిస్తాడు.
ఇవే కాదు ఇంకా అనేక రకాల చిన్న వస్తువులను, బొమ్మలను తయారు చేశాడు ఇంజినీర్.4 మిల్లీ మీటర్ల ఎత్తు, పొడవు, వెడల్పు ఉండే అతి సూక్ష్మ పరిమాణంలో తాజ్ మహల్ని చెక్కాడు. అంతే కాదండోయ్ ఈఫిల్ టవర్ను అత్యంత చిన్నగా 4 మిల్లీ మీటర్ల పొడవు, 2 మిల్లీ మీటర్ల వెడల్పుతో తయారు చేశాడు. వీటిని తయారు చేయడానికి ఒక్కోదానికి సుమారు 3 నుండి 5 నెలల సమయం పడుతుందని దయాకర్ చెప్తున్నాడు. ఇంజినీర్ దయాకర్ తయారు చేసిన అతి సూక్ష్మ వస్తువులను ప్రదర్శినలా పెట్టాడు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.