తినడానికి తిండి లేదు నిలువ నీడ లేదు. తోడుగా ఉండాల్సిన భార్య అనారోగ్యంతో దూరమైంది. ఇళ్లు కట్టుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఇలాంటి దీన స్థితిలో బాత్రూమ్లోనే బతుకు పోరాటం సాగిస్తున్న లింగయ్యపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
ఈ వ్యక్తి పేరు పెరుగు లింగయ్య. కడు పేదరికంలో జీవన పోరాటం సాగిస్తున్నాడు. ఇతని స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షిట్పేట. లింగయ్య నివాసం ఉండే ఇళ్లు పాతది కావడంతో ఆరేళ్ల క్రితం కూలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతని భార్య అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో దిగులు చెంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. చివరికి చేతిలో పైసలు లేక, ఇళ్లు నిర్మించుకోలేక, ఇంటి ముందు నిర్మించిన బాత్రూమ్లోనే నివాసముంటూ అనేక అవస్థలు పడుతున్నాడు.
బాత్రూమ్లో ఓ మూలన పడుకోవడం, అదే బాత్రూమ్లో స్నానం చెయ్యడం మరోవైపు బాత్రూమ్కి కరెంట్ లేదు. తలుపులు లేవు. ఒకవేళ వర్షం పడితే బాత్రూమ్లోకి నీళ్లు చేరుతుంటాయి. ఇలాంటి చోటనే దుర్భరమైన జీవనం సాగిస్తున్నాడు లింగయ్య. ఇలా ఉండడానికి సరైన గూడు లేకపోవడంతో తన కొడుకు అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడని లింగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
లింగయ్య కొద్ది నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏదైనా కూలీ పనికి వెళ్దామంటే ఆరోగ్యం సహకరించడం లేదు. తినడానికి అనేక అవస్థలు పడుతున్నాడు. కడుపు నింపుకోవడానికి బిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకవేళ భోజనం దొరకకపోతే పస్తులుంటున్నాడు. ఇలాంటి దీన స్థితిలో ఉన్న లింగయ్యకు కనీసం సర్కార్ ఆసరా పెన్షన్ కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
బాత్రూమ్లో జీవించలేక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగాడు లింగయ్య. కానీ ఎలాంటి ఫలితం లేదు. లింగయ్య ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సర్కార్ పట్టించుకోకపోవడంపై స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించి లింగయ్యకు గూడు కల్పించాలని కోరుతున్నారు. బాత్రూమ్లోనే బతుకు పోరాటం సాగిస్తున్న లింగయ్య కష్టాలు తీరాలని మనసారా కోరుంటున్నారు లక్షిట్పేట గ్రామస్థులు.