ప్రచండ ఫోని ఒడిశా తీరాన్ని తాకింది. పూరీకి దక్షిణంగా తీరాన్ని తాకి ముందుకు కదులుతుంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఫోని దూసుకెళ్తుంది. దీని ప్రభావంతో గంటకు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఒడిశాలో ఎంటర్ అయిన ఫొని బెంగాల్ దిశగా వెళ్లనున్నది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఖరగ్పూర్లో మమతా బెనర్జీ నేడు తుఫాన్ పరిస్థితిని అంచనా వేయనున్నారు. రేపు కూడా మమతా బెనర్జీ తీరం సమీపంలోనే ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు. అయితే నేడు, రేపు నిర్వహించాల్సిన ఎన్నికల ర్యాలీలను దీదీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. రైళ్లు రద్దు కావడంతో కోల్కతా రైల్వే స్టేషన్లోనే వందలాదీ ప్రజలు అక్కడే ఉండిపోయారు. కోల్కతా విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు ఉదయం 8.30 నిమిషాల వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.