మూల్యాంకన వివాదాలు తెలంగాణ ఇంటర్ బోర్డును వీడటం లేదు. వాల్యూయేషన్లో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు సాగిస్తుండగానే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇంటర్ బోర్డ్ అక్రమాలపై విచారణ జరపాలంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కొందరు అధికారుల కారణంగా పలు చోట్ల విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తక్షణమే విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ బాలల హక్కుల సంఘం తరపు న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు విచారిస్తామని తెలిపింది. తాజా పరిణామాల నేపధ్యంలో హైకోర్టు తీసుకునే నిర్ణయంపై అటు తల్లిదండ్రుల్లో ఇటు అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.