సినీ నటులు జీవిత, రాజశేఖర్ మళ్లీ వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్ను కలిసిన జీవిత, రాజశేఖర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని చెప్పిన రాజశేఖర్ దంపతులు పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. జగన్ నివాసమైన లోటస్ పాండ్లో ఈ సమావేశం జరిగింది. అనంతరం నటుడు రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్ను కలిశాను. జగన్ కు మాకు ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి అని అన్నారు. అయితే అవి తొలగించుకోవడానికే తాను ఈరోజు లోటస్పాండ్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చాను అన్నారు. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం. అని అన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓటర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే అది ఒక్క వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు.