తెలంగాణ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలస కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ నెల 19న టీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కేటీఆర్తో భేటీ అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మలపై గెలిచారు. అయితే త్వరలో కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వేగం మరింత పుంజుకుంది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి సైతం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.