ఏపీలో ఎన్నికల పొలింగ్ సమీపిస్తున్న వేళ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయా పార్టీనేతలు. ఈ క్రమంలోనే ఒకరిపై మరోకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చని చంద్రబాబు మోసపూరితమైన మ్యానిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని జగన్ ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో 54 పేజీలతో కూడా ఎన్నికల ప్రణాళికను బాబు విడుదల చేశారని కానీ అధికారంలోకి వచ్చాక అవేవీ అమలు చేయకపోగా ఈసారి అబద్ధాలతో కూడిన 34 పేజీల మ్యానిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు.ఆదివారం రాజానగరం కోరుకొండలో జగన్ రోడ్ షోలో ప్రసంగించారు. ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కుట్ర చేస్తున్నారని, ఆయన పాలనపై చర్చ జరిగితే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.