తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు తెలంగాణ ఇంటర్బోర్డు నాంపల్లి కార్యాలయం దగ్గర రెండోరోజు కూడా ఆందోళన బాటపట్టారు. అటు రాజకీయ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇంటర్ బోర్డు వ్యవహారం రాష్ట్రాన్ని ఊపేస్తోంది ఇక దీంతో అధికారులు ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్తో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచారు. ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలపై గందరగోళం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. గడువు తేదీని ఈనెల 27 వరకు పొడిగించింది. ఆన్లైన్ ఫీజులు చెల్లింపులో సాంకేతిక సమస్యల కారణంగా గడువును పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ను ఫ్రీగా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినకానీ దానికి ఒప్పుకోలేదు అధికారులు. రీ వెరిఫికేషన్కు రూ.600, రీ కౌంటింగ్కు రూ.100 ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు.