మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. ఉదయం 9 గంటల 27 నిమిషాలకు నెల్లూరు జిల్లా షార్ నుంచి PSLV -సీ 45 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఓ స్వదేశీ ఉపగ్రహంతో పాటు మరో 28 విదేశీ శాటిలైట్లను PSLV -సీ 45 తీసుకెళ్తోంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ : షార్ నుంచి PSLV -సీ 45 రాకెట్ ప్రయోగం జరుగుతుంది. షార్లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి PSLV -సీ 45ని ప్రయోగిస్తారు. ఇవాళ ఉదయం సరిగ్గా 9:27 గంటలకు PSLV -సీ నింగిలోకి దూసుకెళ్తుంది.
PSLV -సీ 45 వాహక నౌక ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఇమిశాట్తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. డీఆర్డీవో రూపొందించిన ఇమిశాట్.. బరువు 436 కిలోలు దీనిని రోదసిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెడతారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడుతుంది. అలాగే అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్, స్పెయిన్కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో PSLV -సీ 45 విడిచిపెడుతుంది.
మరోవైపు షార్లో రాకెట్ ప్రయోగాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం తొలిసారి అందుబాటులోకి తెచ్చారు. పదివేల మంది సందర్శకులు కూర్చునే విధంగా గ్యాలరీ నిర్మాణ పనులు చేపట్టారు. మొదటి దశలో పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదువేల మంది సందర్శకులు రాకెట్ ప్రయోగాలను వీక్షించేలా పనులు పూర్తి చేశారు. అయితే భద్రత కారణాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ జరిగే పీఎస్ఎల్వీ-సీ45 రాకెట్ వీక్షణకు వెయ్యి మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాకెట్ వీక్షణకు వచ్చే సందర్శకులు భారత పౌరులై ఉండాలి. అలాగే పదేళ్ల వయస్సు దాటిన వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. ఇందుకోసం ముందుగా ఇస్రో వెబ్సెట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.