మరికొన్ని గంటల్లో స్వదేశానికి అభినందన్...వాఘా సరిహద్దు వద్ద నిఘా పెంపు
పైలట్ అభినందన్ను పాకిస్థాన్ ఇవాళ, భారత్ కు అప్పగించనుంది. ఇండో పాక్ సహరిద్దుల్లోని వాఘా బోర్డర్ దగ్గర అభినందన్ను భారత్ అధికారుల సమక్షంలో అప్పగించనున్నారు. వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్కు ఘనంగా స్వాగతం పలికేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఇవాళ అభినందన్ వాఘా బోర్డర్ కు రానున్న నేపధ్యంలో బోర్డర్ లో నిఘా పెంచడంతో పాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు.
యావత్ భారతావని గత రెండు రోజులుగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. ఇవాళ అభినందన్ పాక్ నుంచి స్వదేశంలోకి అడుగుపెడుతున్నాడు. ఆ క్షణం కోసమే దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మధ్యాహ్నం తర్వాత ఏ సమయంలోనైనా అభినందన్ వాఘా బోర్డర్ నుంచి మనదేశానికి రానున్నాడు. ఇందుకోసం వాఘా సరిహద్దు దగ్గర ఉత్కంఠ భరితమైన వాతావరణం నెలకొంది.
పాకిస్ధాన్పై అంతర్జాతీయంగా భారత్ తెచ్చిన ఒత్తిడి పని చేసింది. భారత్ దౌత్యవ్యూహాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లలకు తలొగ్గిన పాక్.. అభినందన్ ను భారత్ కు అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. సాయంత్రంలోపు అభినందన్ స్వదేశంలో అడుగుపెట్టనున్నారు.