తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం పరుస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చొరవ చూపారు. అయితే కొంతకాలంగా నరసింహన్ ఏపీ ప్రభుత్వంతో ఎడమోహం పెడమొహంగా ఉంటున్నారు.
బుధవారం జరిగిన పరిణామాలు గవర్నర్, బాబు మధ్య దూరం మరింత పెంచాయని పలువురు భావిస్తున్నారు. ఏపీ సర్కార్ చుక్కల భూముల ఆర్డినెన్స్ ను గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే విధంగా ఆర్డినెన్స్ లేదని సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్ల్లో ఒకటిని తిరస్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్ తప్పుబట్టారు. కేవలం అసైన్మెంట్ ఆర్డినెన్స్ను మాత్రమే ఆమోదించారు.
ఇటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబు ఎడమొహంగా ఉన్నారు. ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగం పూర్తి కాగానే గవర్నర్ నరసింహన్ వెళ్లిపోయారు. శాసనసభ ఎదుట అప్పటికే సిద్ధంగా ఉన్న తన కాన్వాయ్లో నేరుగా విజయవాడ వెళ్లిపోయారు.
విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంతో ఏపీ సర్కార్ ఢీ అంటే ఢీఅంటోంది. ఢిల్లీ వేదికగా చంద్రబాబు నిరసన దీక్షకు రెడీ అవుతున్నారు. అయితే కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వడమే గవర్నర్ తీరులో మార్పు రావడానికి కారణమా అని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోననే సందేహాలు కలుగుతున్నాయి.