టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయ అరంగేట్ర ఎన్నికల్లోనే దూమ్ములేపాడు. లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన గంభీర్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3 లక్షల 77 వేల ఓట్ల తేడాతో గెలిచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంతోనే తన గెలుపు సాధ్యమైందని గంభీర్ అన్నారు. గత ఐదేండ్లలో ప్రధాని మోదీ అద్భుత నాయకత్వ ఫలితమే ఈ విజయం.
నిజాయతీతో కష్టపడి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానికి ఇది నిదర్శనం. నాపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఎదురైన భారీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాని, మోదీని నిందించే బదులు తమ బలాబలాలపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. ఓటమికి గల కారణాలపై సమీక్షించ చేసుకోకపోతే వాళ్లు ఎప్పటికీ అధికారంలో రాలేరని నేను రాతపూర్వకంగా రాసి ఇవ్వగలను అని గంభీర్ వ్యాఖ్యానించారు. త్వరలో ప్రపంచకప్ ఆరంభంకానున్న నేపథ్యంలో టీమిండియాకు గంభీర్ శుభాకాంక్షలు తెలిపారు. 2011లో గెలిచిన భారత్కు 2019లోనూ ప్రపంచ కప్ గెలుచుకునే మరో అవకాశం ముందుకొచ్చిందని అన్నారు.