కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో ఒకే రోజు రెండు పంపుల వెట్ రన్ నిర్వహించారు అధికారులు. ఉదయం మూడో పంప్ వెట్ రన్ చేయగా, సాయంత్రం నాలుగో పంప్ వెట్ రన్ విజయవంతం చేశారు. ఓకేసారి నిర్వహించిన రెండు పంపుల వెట్ రన్ సక్సెస్స్ అవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం భూగర్భంలో నిర్మించిన పంప్హౌస్లోని మూడో మోటర్ వెట్ రన్ విజయవంతమైంది. మూడో పంపు వెట్ రన్ను నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు.
గత నెల 24, 25వ తేదీల్లో మొదటి, రెండో మోటర్లు వెట్ రన్ నిర్వహించిన అధికారులు, ఇవాళ మూడో మోటర్ వెట్ రన్ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్లో భారీ పంపు హౌస్ నిర్మించారు. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్లో ఎత్తిపోసేందుకు పంప్హౌస్లో ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేశారు. వెట్ రన్ సక్సెస్తో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. మూడో వెట్ రన్ విజయవంతం కావడంతో సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్ను అధికారులు ప్రారంభించారు.