సార్వత్రిక ఎన్నికల తొలి సమరం ముగిసింది. 91 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఆరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఓటింగ్ జరిగింది. తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగాముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 543 లోక్సభ స్థానాలకుగానూ తొలి విడతలో 91 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఏపీలో 25 ఎంపీ స్థానాలు, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 8 లోక్ సభ నియోజక వర్గాలు, మహారాష్ట్ర 7, ఉత్తరాఖండ్ 5, అస్సాం 5, బిహార్ 4, ఒడిశా 4,పశ్చిమ బెంగాల్ 2, జమ్మూ కశ్మీర్ 2 స్థానాలకు పోలింగ్ జరిగింది.
91 లోక్సభ స్థానాల్లో 1,206 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిదశలో పోటీ పడిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వీకే.సింగ్, కిరన్ రిజిజు తో పాటు హరీశ్ రావత్, గౌరవ్ గొగోయ్ చిరాగ్ పాశ్వాన్, అగాథా సంగ్మా ఉన్నారు. 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ సీట్లు, సిక్కింలోని 32 శాసనసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అలాగే ఒడిశాలోని 147 అసెంబ్లీ సీట్లకుగాను మొదటి విడతలో 28 స్థానాలకు ఓటింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం నుంచే ఉత్సాహంగా జరగ్గా..మరికొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఎండ వేడి ఉన్నా ఓటర్లు ఓపికతో ఓటు వేశారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు జరిగినా పోలింగ్ ప్రశాంతగా ముగిసింది. మొత్తం ఏడు విడతల్లో లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా చివరి దశ పోలింగ్ మే 19న నిర్వహిస్తారు. మే 23వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.