చివరి విడుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 160 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 17 వందలా 38 ఎంపీటీసీ స్థానాలకు 5 వేల 726 మంది బరిలో ఉన్నారు. ఇందుకోసం 9 వేల 494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే తొలి విడుతలో వాయిదా పడ్డ సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
ఇటు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 205 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి.