ఎన్నికల పోలింగ్ తేది దగ్గరవుతున్న తరుణంలో పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో తాజాగా మాజీ శాసనసభ్యుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కాగా గత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన సుబ్బరాయుడు టీడీపీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్ ఆశించిన సుబ్బరాయుడికి నిరాశే మిగిలింది. టీడీపీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనై మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. ఇక త్వరలోనే తన అనుచరులు, కుటుంబీకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.