తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఎలక్షన్ క్యాంపైనింగ్ ఈ సాయంత్రం 5గంటలకు క్లోజైంది. దాంతో ఇన్ని రోజులూ హోరెత్తిన మైకులు మూగబోయాయి. జనంతో కిటకిటలాడిన కూడళ్లు, వీధులన్నీ బోసిపోయాయి. మార్చి 10న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. 18న తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. దాదాపు నెలరోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. సభలు, రోడ్షోలతో అలుపెరగకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయా పార్టీల అధినేతలు చివరి రోజు పంచ్ డైలాగులతో ఫైనల్ టచ్ ఇచ్చారు. లాస్ట్ డే క్యాంపైనింగ్లో అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తూ మెరుపులు మెరిపించారు.
ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 20 రాష్ట్రాల్లో 91 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియడంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్లతోపాటు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు డిస్పాచ్ చేస్తున్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల బందోబస్తు తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు.