చంద్రగిరిలో రీ పోలింగ్పై రగడ కొనసాగుతూనే ఉంది. వైసీపీ చేసిన ఫిర్యాదులకే ఈసీ ప్రాధాన్యం ఇస్తోందంటూ అధికార టీడీపీ ఆందోళనలకు దిగింది. 5 తోనే సరిపెట్టుకోకుండా మరో 8 కేంద్రాల్లో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే రీ పోలింగ్ను స్వాగతించిన వైసీపీ ఓటర్లు స్వేచ్ఛగా ఓటెయ్యాలని పిలుపునిచ్చింది.
చంద్రగిరిలో రీ పోలింగ్పై మరోసారి అధికార విపక్షాల మధ్య మరో చిచ్చు రాజుకుంది. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిని అవలంభిస్తోందంటూ అధికార టీడీపీ రోడ్డెక్కింది. రీ పోలింగ్పై ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే ముందూ వెనుక ఆలోచించకుండా పోలింగ్ ముగిసిన నెల తర్వాత నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఐదింటితో పాటు చంద్రగిరిలోని నియోజకవర్గంలోని 166, 310 బూత్లలో కూడా రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
అయితే తాము ఏడు చోట్ల రీ పోలింగ్పై ఫిర్యాదు చేస్తే ఈసీ మాత్రం 5 కేంద్రాల్లోనే అనుమతిచ్చిందని చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఓ వర్గం ప్రజలు ఓటేయ్యకుండా కేంద్రాల దగ్గర అధికార పార్టీకి చెందిన వారు అడ్డుకున్నారని ఆరోపించిన చెవిరెడ్డి రీ పోలింగ్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా ఎన్నికల అధికారులు మాత్రం రీ పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీసీ ఫూటేజీ అడిగిందని ఆమేరకు ఆధారాలు పంపించామని సబ్ కలెక్టర్ మహేశ్కుమార్ తెలిపారు. ఆ 5 కేంద్రాల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేని తెలిపారు. ఈసీ పక్షపాత ధోరణిపై తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.