ఐటీ గ్రిడ్ కంపెనీలో నిర్వహించిన తనిఖీల్లో కీలక సమాచారం సేకరించినట్లు సైబారాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర ఉండే డేటా మొత్తం ఐటీ గ్రిడ్ దగ్గర ఉందన్న సీపీ నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత సమాచారం సేకరించారని తెలిపారు. ఓటర్ల కులం, ఫోన్ నెంబర్లు సేకరించి. ఏ పార్టీకి అనుకూలమో తెలుసుకుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు.
ఓట్ల తొలగింపు కూడా ఐటీ గ్రిడ్ నుంచే చేశారన్న సైబారాబాద్ సీపీ సజ్జనార్ ఓట్ల తొలగింపుపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే డేటా దుర్వినియోగానికి పాల్పడి ఉండొచ్చన్నారు. ఐటీ గ్రిడ్లో దొరికిన సమాచారంతో ఆధార్ సంస్థతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. అలాగే ఇక ఐటీ గ్రిడ్ సమాచారాన్ని భద్రపర్చుతోన్న అమెజాన్ సర్వీసెస్కి నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఐటీ గ్రిడ్లో ట్యాబ్లు, సీపీయూలు సీజ్ చేసినట్లు సైబారాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. సీజ్ చేసిన వస్తువులను, సమాచారాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినట్లు తెలిపారు. అయితే ఆధార్, ఓటర్ డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ ఎలా సేకరించగలిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసినట్లు సైబారాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఏపీ పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉందన్న ఒక మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి వస్తారా? అంటూ ప్రశ్నించారు. పైగా ఫిర్యాదు వచ్చిన 3గంటల్లోనే హైదరాబాద్కి ఎలా రాగలిగారోనని అనుమానాలు వ్యక్తంచేశారు. ఐటీ గ్రిడ్లో మేము తనిఖీలు నిర్వహించి ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్న సమయంలోనే ఏపీ పోలీసులు వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారని సజ్జనార్ అన్నారు.