డేటా చోరీకి సంబంధించిన చర్చలు తారా స్థాయికి చేరాయని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల డేటాను తమ డేటా అంటున్నారని, ప్రజల డేటా తమ డేటా ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర డేటాను ఐటీ గ్రిడ్ సంస్థకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, కేసీఆర్, జగన్, చంద్రబాబు కలిసి కుమ్మక్కై... ఈ కుట్ర చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే తిరుపతిలో చీరలు పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, జనసేన ప్రభుత్వం వస్తుందని వివరించారు.