పథకం ప్రకారమే జగన్పై దాడి జరిగింది: విశాఖ సీపీ లడ్డా
జగన్పై కోడికత్తితో దాడి ఘటన అంతా పథకం ప్రకారమే జరిగిందని విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్చంద్ర లడ్డా స్పష్టం చేశారు. జగన్పై దాడికి సంబంధించిన కేసు వివరాలను వెల్లడించిన ఆయన నిందితుడు శ్రీనివాస్ జగన్పై దాడి చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించాడని వివరించారు.
జగన్పై కోడికత్తితో దాడి ఘటన అంతా పథకం ప్రకారమే జరిగిందని విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్చంద్ర లడ్డా స్పష్టం చేశారు. జగన్పై దాడికి సంబంధించిన కేసు వివరాలను వెల్లడించిన ఆయన నిందితుడు శ్రీనివాస్ జగన్పై దాడి చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించాడని వివరించారు. గత అక్టోబర్ 18 నే జగన్పై దాడి చేయాలని భావించినా అంతకుముందు రోజే జగన్ దసరా సెలవుల కోసం విశాఖ నుంచి వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. తర్వాత అక్బోబర్ 25 న పథకం ప్రకారం దాడికి తెగబడ్డాడని వివరించారు.
గత జనవరిలో శ్రీనివాస్ రాజుపాలెంలో రెండు కత్తులను సంపాదించాడని సీపీ లడ్డా తెలిపారు. అదే యేడాది నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీని కూడా తయారుచేయించాడని తెలిపారు. ఇక జగన్పై దాడి జరిగిన రోజు ఉదయం 4 గంటలా 55 నిముషాలకు ఎయిర్పోర్ట్కు వచ్చిన శ్రీనివాస్ ఉదయం 9 గంటల సమయంలో కత్తికి పదును పెట్టాడని వివరించారు. తర్వాత ఎయిర్పోర్ట్లో జగన్ అక్కడి పార్టీ కార్యకర్త అయిన హేమలతతో పాటు కరణం ధర్మశ్రీ, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో శ్రీనివాస్ కత్తితో జగన్పై దాడి చేశాడని లడ్డా తెలిపారు.
శ్రీనివాస్ ఉపయోగించిన కత్తిని జగన్ భుజం నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తీశారని తొలుత కత్తికి విషం ఉందనే అనుమానంతో దగ్గర్లోని డయాగ్నోస్టిక్ సెంటర్కు, తర్వాత కళా హాస్పిటల్కు వెళ్లారని సీపీ చెప్పారు. ఎయిర్పోర్ట్లో ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ 0.5 మందం కోడికత్తి దిగిందని చెప్పారన్నారు. ఈ కేసులో మొత్తం 92 మందిని విచారించినట్లు సీపీ లడ్డా తెలిపారు.
నిందితుడు శ్రీనివాస్ గతంలో కర్ణాటక, కువైట్లో వెల్డర్ గా హైదరాబాద్, బళ్లారి, రాజమండ్రి, అమలాపురంలో కుక్గా పనిచేశాడని తెలిపారు. దాడికి ముందు రోజు సన్నిహితులతో రేపు నా పేరు టీవీలో వస్తుందని చెప్పాడని కూడా లడ్డా వివరించారు. నిందితుడు వాడిన కత్తితో పాటు ల్యాబ్ రిపోర్ట్ కూడా అందిందని తెలిపారు.