కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకున్న రాహుల్ శ్రీకృష్ణ అతిధిగృహంలో కొంత విశ్రాంతి అనంతరం సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూకాంప్లెక్స్ క్యూలైన్ గుండా వెళ్లి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాహుల్గాంధీకి పడికావలి దగ్గర టీటీడీ జీఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.
ఉదయం 11గంటల 40 నిమిషాలకు కాలి నడకన తిరుమల బయల్దేరిన రాహుల్గాంధీ ఎలాంటి బ్రేకులు లేకుండా ఏకధాటిగా నడిచారు. మధ్య మధ్యలో సహచరుల్ని, భక్తులను పలకరిస్తూ నడక సాగించారు. అలిపిరి నుంచి గంటన్నర సమయంలోనే తిరుమల చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ సమయంలో తిరుమలకు చేరుకున్న మొదటి రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారు.