అమరావతిలో హైకోర్టు భవనానికి శంకుస్థాపన జరగడం ఏపీ సాధించిన గొప్ప పురోగతి అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్. న్యాయం కోరుకునే వాళ్లకి ఏపీ హైకోర్టు ఆశాదీపంలో కనిపిస్తుందన్నారాయన. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తాత్కాలిక హైకోర్టు భవన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అత్యంత ఆధునీక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారన్నారు. హైకోర్టు భవనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతి, ఆనందానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.
న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గొగోయ్ అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయమన్నారు జస్టిస్ రంజన్ గొగోయ్. ఏపీకి కొత్త హైకోర్టు రావడం ప్రజలందరికీ ఆనందదాయకమన్నారు. రాజ్యాంగబద్ధమైన విధిని సక్రమంగా, సకాలంలో సీఎం నిర్వర్తించారని అన్నారు.
అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవన నిర్మాణం ప్రధాన ఘట్టమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ర్ట విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయన్నారు. 2022 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు కూడా దోహదం చేస్తాయన్నారు చంద్రబాబు. అమరావతిలో నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటుకు సుప్రీం కోర్టు సహకరించాలన్నారు ఇందు కోసం అవసరమైన భూమి ఇస్తామని చెప్పారు చంద్రబాబు
అమరావతి రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకమన్నారు జస్టీస్ ఎన్వీ రమణ. ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు ఆయన. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ముందు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమి సేకరించి భవనం నిర్మించడం గొప్ప విషయమన్నారు. 179 రోజుల్లోనే కొత్త భవనాన్ని నిర్మించి హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు. హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయాధికారులు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.