తనపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో నిన్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరైన ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 8 గంటల పాటు విచారించిన రేవంత్ను ఇవాళ కూడా మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఓటుకు నోటు కేసులో విచారణల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు అధికారులు రేవంత్ను విచారించారు. ఐటీ, ఏసీబీ అధికారులు వేర్వేరుగా రేవంత్ను విచారించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అక్రమాలపై తాను ఎన్నిసార్లైనా మాట్లాడతానని కేసీఆర్కు కూడా త్వరలోనే ఇలాంటి రోజులు వస్తాయని అప్పుడు మోడీ కూడా ఆయన్ని కాపాడలేరని రేవంత్ అన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాసనసభ ఎన్నికలపుడు ఐటీ అధికారులను ప్రయోగించారని, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈడీని ప్రయోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈడీ విచారణ వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనపై కక్ష్య సాధింపు చర్యలకు ఇది నిదర్శనం అని అన్నారు. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్దీ విచారిస్తున్నారని చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ విచారణ జరుపుతున్నారని తెలిపారు. మోడీ, కేసీఆర్లపై వ్యతిరేకంగా పోరాడుతున్న వారినే దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును ఈడీ అధికారులు విచారించారని రేవంత్ తెలిపారు. బుధవారం కూడా మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని రేవంత్ తెలిపారు.