లోక్సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్కు ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా ఈ నెల 18న 12 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించిన 97 నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లో రెండో దశలో పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమ బెంగాల్లో 3, జమ్మూకశ్మీర్లో 2, మణిపూర్ 1, త్రిపుర 1, పుదుచ్చేరిలోని 1 లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
వీటితో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏప్రిల్ 18వ తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడుతలోని 97 లోక్సభ స్థానాలకు 1674 మంది పోటీ పడుతున్నారు. ఒడిశా అసెంబ్లీకి 244 మంది బరిలో ఉన్నారు. అయితే తమిళనాడులో ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ధనప్రవాహం అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఈసీ ధన ప్రభావానికి చెక్ పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇక నేటితో ఎన్నికల ప్రచారానికి చిట్ట చివరిరోజు కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశా, చత్తీస్గఢ్లో పలు ర్యాలీలలో పాల్గోని ప్రసంగించారు. ఇక కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా కేరళలో పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు.