స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నెల 31 న జరగనున్న ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ఛాలెంజ్గా తీసుకోవడంతో విజయం సాధించేందుకు అప్పుడే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలు పక్కదారి పట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నిక వరకు కాపాడుకునేందుకు రకరకాలుగా ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికను సవాల్గా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా చేజిక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది.
గతంలో ఈ స్థానం నుంచి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి అవకాశం ఇచ్చారు. విజయం సాధించడం సునాయాసమే అయినా మెజార్టీ తగ్గేందుకు అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రత్యేక బస్సుల్లో ఇతర రాష్ట్రాలకు తరలించారు.
ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఎవరు ఎప్పుడు అధికారపార్టీ వైపు చూస్తారనే భయంతో ఉన్న విపక్ష పార్టీ నాయకులు కూడా ఏ మాత్రం తగ్గకుండా తమవారిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులను కేరళలోని మున్నార్కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అసలే వేసవి కాలంతో పాటు ఈ నెల 31 వరకు అక్కడే ఉండాల్సి రావడంతో ప్రజాప్రతినిధులను చల్లని ప్రదేశాలకు తరలిస్తున్నారు.