అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని, ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర సమితిని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిచాయి. సారు.... కారు... పదహారు అంటూ నినదించిన గులాబీదళం పదహారులో సరిగ్గా ఎనిమిది స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తంగా తెలంగాణ పోల్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం.
తెలంగాణలో 16 చోట్లా తమదే విజయమన్న టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పుంజుకున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలుండగా 9 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ 3 చోట్ల గెలవగా బీజేపీ నాలుగు చోట్ల ప్రభావం చూపించింది.
అటు - తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. తనకు బాగా పట్టున్న స్థానాల్లో కమలనాథులు పుంజుకోవడం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ను కమలం కలవరపెట్టినట్టే కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మంచి ఫలితాలను కట్టబెట్టాయి. అన్ని సర్వే సంస్థలూ ఒకేరకమైన నివేదికలు ఇచ్చాయి. కానీ తొలి దశ రౌండ్లలో సీను మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే టీఆర్ఎస్కు ఈ ఫలితాలు మాత్రం వ్యతిరేకమైన తీర్పును ఇచ్చినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్కు బలమైన పట్టున్న కరీంనగర్, నిజామాబాద్లాంటి స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడాన్ని దీనికి ఉదహరణగా చెబుతున్నారు.