రెండోసారి భారత ప్రధాని పదవి చేపడుతున్న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరగనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మోడీ ప్రమాణ స్వీకారానికి ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హాజరుకావడం లేదు. మోదీకి భూపేష్ బాఘేల్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నానని భూపేష్ బాఘేల్ పేర్కొన్నారు. ఇక మరోవైపు తమ మంత్రివర్గ సహచరుల ప్రమాణ స్వీకారం కూడా గురువారం ఉన్నందున తాను కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
నేటి సాయంత్రం 7గంటలకు మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత అతిథులకు స్నాక్స్ ఏర్పాటు చేయనున్నారు. అంతరం డిన్నర్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వెరైటీలతో పాటు రాష్ట్రపతి భవన్ పాపులర్ వంటకమైన దాల్ రైసినాను వడ్డించనున్నారు. మొత్తానికి మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అథితులకు డిన్నర్ భోజనం కూడా రెడీ అవుతోంది.