నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో అపహరణకు గురైన పురిటిబిడ్డ వ్యవహారం సుఖాంతం అయింది. బాబు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి 2 గంటల లోపే పోలీసు సిబ్బంది నిందితులను పట్టుకున్నారని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్యర్య రస్తోగి తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిన్నారి అదృశ్య ఘటనపై పోలీసులు పలు బృందాలుగా ఏర్పాటై గాలించారని చెప్పారు. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించి వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అలాగే, అదేసమయంలో కొందరు పోలీసు సిబ్బంది ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఇద్దరు మహిళలు పసికందును తీసుకెళ్లినట్టు గుర్తించారన్నారు. అనంతరం వారి ఫొటోలను సేకరించి ఇన్ఫార్మర్ ద్వారా వారిద్దరినీ కోవూరులో అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. జిల్లా ఎస్పీ ఐశ్యర్య రస్తోగి సిబ్బందిని ప్రశంసించారు.