తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు ఎవరికి వారే సిద్ధమౌతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో ప్రతి లోకసభ నియోజకవర్గానికి రెండు నుండి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తోంది టీపీసీసీ. అయితే ఇప్పటికే ఓ జాబితాను కూడా తయారు చేసినట్లు సమాచారం. ఈ జాబితాను త్వరలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ను లోకసభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. అయితే ఇదే నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 2009, 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ పోటీ చేయనున్నారు. ఇక దీంతో అజారుద్దీన్, అసదుద్దీన్ మధ్య గట్టి పోటీ కనబడే అవకాశం ఉంది. చూడాలి మరీ ఎన్నికల రణరంగంలో ఎవరిని విజయం వరిస్తోందో.