గెలుపే లక్ష్యంగా.. అగ్రనేతల హోరాహోరి ప్రచారం

Update: 2019-04-07 04:43 GMT

దేశవ్యాప్తంగా తొలి దశ జరిగే ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆటకట్టుకునే యత్నాలు చేస్తున్నారు. హామీల వర్షం కురిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గెలుపే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. దేశవ్యాప్తంగా 91లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 9వ తేదీ ప్రచార పర్వానికి తెరపడనుంది. ప్రచారం ముగియడానికి గడువు సమీపిస్తుండటంతో నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో పార్టీలు హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకేరోజు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలకృష‌్ణ రోడ్ షోలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. విజయమ్మ, షర్మిల రోడ్ షోల ద్వారా ప్రచారం ముమ్మరం చేశారు. అధికార పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ఉధృతం చేశారు. రోడ్ షోలతో అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు పవన్. 

Similar News