ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ bieap.gov.in అందుబాటులో ఉంచనున్నామని అధికారులు పేర్కొన్నారు.
కాగా మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేస్తున్నారు. ఫస్టియర్, సెకండ్ ఇయర్లకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదలచేయనున్నారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకూ సెకండియర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం నుంచి 5,07,302 మంది హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,10,298 మంది విద్యార్థులు హాజరయ్యారు.