ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం బేఖాతర్ చేసింది. ఆయనను ఐబీ చీఫ్గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మంగళవారం జీవో ఇచ్చిన ప్రభుత్వం మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది.
ప్రభుత్వ అధికారుల మాదిరి కాకుండా, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మను తక్షణమే బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయాలని, వారిని ఎలాంటి ఎన్నికల విధులకు వినియోగించరాదని సీఈసీ ఆదేశించింది. తక్షణమే నెక్ట్స్ సీనియర్లకు బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తప్పుకుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆ ముగ్గుర్నీ ఆదేశించారు ఈ మేరకు బదిలీ ఉత్తర్వుల జీవో నెంబరు 716ను జారీ చేశారు. అయితే ఈసీ ఆదేశాలు టీడీపీ అధినేత చంద్రబాబు బేఖాతర్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దు చేయించారు. మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొంటూ బుధవారం 720 జీవో జారీ చేశారు.
ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారనే కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. డీజీపీతో, కొందరు న్యాయవాదులతో మంగళవారం రాత్రి సుదీర్ఘ చర్చలు జరిపిన ముఖ్యమంత్రి సీఈసీ ఆదేశాలపై కోర్టులో సవాల్ చేయించారు. పలానా పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారని, సీఈసీ అజమాయిషీలోకి వస్తారంటూ బుధవారం జీవో నంబరు 721 జారీ చేయించారు. ఈ జీవోలో ఇంటెలిజెన్స్ విభాగం ప్రస్తావన లేకుండా చూశారు.
సీఈసీ ఆదేశాలు బేఖాతర్ చేయడంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు అవకతవకలకు పాల్పడుతున్నారని మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.30గంటలకు ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డిలతో కూడిన బృందం కలసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది.