బడ్జెట్ లో అన్నదాతలకు వరాల జల్లు

Update: 2019-02-05 10:38 GMT

బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు వరాల జల్లు కురిపించింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పథకానికి బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీతో 39.33 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. విశ్వ విత్తన కేంద్రంగా ఏపీని చేస్తున్నామని యనమల స్పష్టం చేశారు.

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైతులకు పెద్ద పీట వేస్తూ మంగళవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు.

రూ.2.5 లక్షల రాయితీతో ట్రాక్టర్ల పంపిణీ చేసినట్లు యనమల తెలిపారు. కర్నూలులో రూ.650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో 35,508 మందికి లబ్ది చేకూరిందన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా 88,780 ఎకరాలు సాగులోకి వచ్చిందని, బిందు సేద్యం ద్వారా 7.25 లక్షల రైతులకు లబ్ది చేకూరిందన్నారు.

7.3 లక్షల హెక్టార్లు సస్యశ్యామలం అయ్యాయని మంత్రి తెలిపారు. నాలుగేళ్లలో కౌలు రైతులకు పంట రుణాలను రూ.272 కోట్ల నుంచి రూ 4,957 కోట్లకు పెంచామన్నారు. 11.06 లక్షల మంది కౌలు రైతులు రుణాలు పొందనున్నారని, 83,396 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేశామని యనమల పేర్కొన్నారు.

పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించామన్నారు. పశువులపై బీమా కోసం రూ.200 కోట్లు కేటాయించామని, ఆక్వాపై విద్యుత్ టారిఫ్ 4రూపాయల 13పైసల నుంచి రూ. 2కు తగ్గించామన్నారు. నాలుగున్నరేళ్లలో వ్యవసాయంపై రూ.81,554 కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. 

Similar News