నెట్టింట్లో అడుగు పెడితే చాలు.. మాది కొనండి.. ఇది చూడండి.. అటు వెళ్ళండి.. ఇలా వ్యాపార ప్రకటనలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. కొన్నిటిని మనం నిర్దాక్షిణ్యంగా మూసి పారేయొచ్చు. మరి కొన్నిటిని కొన్ని సెకన్ల తరువాత ఆపుకోవచ్చు. కొన్ని మాత్రం వాటి మాట పూర్తిగా విన్న తరువాతే మనల్ని మనపని చేసుకోనిస్తాయి. యు ట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్ ఇలా సోషల్ మీడియాలో ఏది ముట్టుకున్నా ప్రకటన చూడకుండా కుదరదు. ఇప్పటి వరకూ వాట్సప్ కు మాత్రం ఈ బాధ లేదు. కానీ, ఇక నుంచి ఇక్కడ కూడా ఆ బాధ తప్పదట. ఇక నుంచి వాట్సాప్లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ స్టేటస్లో యాడ్స్ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్లో జరిగిన ఫేస్బుక్ మార్కెటింగ్ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
'2020 నుంచి వాట్సాప్లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్లో అవి కనిపిస్తాయి' అని ఈ సదస్సు హాజరైన ఓలివర్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వాట్సాప్లో ప్రకటనలు వస్తాయని గతేడాది అక్టోబర్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఫేస్బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాట్సాప్ స్టేటస్లో ఫొటోలు, టెక్ట్స్, వీడియోలు, యానిమేటెడ్ జిఫ్లను వినియోగదారులు పంచుకోవచ్చు. 24 గంటల తర్వాత అవి కనుమరుగవుతాయి. 'వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.18.305లో ప్రకటనలను తీసుకొస్తోంది. అయితే, ప్రస్తుతం ఇవి వినియోగదారులకు కనిపించవు. భవిష్యత్లో ఈ ఫీచర్ను వాట్సాప్ ఎనేబుల్ చేయనుంది' అని వాట్సాప్బీటా ఇన్ఫోలో పలు ట్వీట్లు కనిపించిన సంగతి తెలిసిందే.