భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. పూలమాల వేసి రాజ్యాంగ ప్రదాతకు అంజలి ఘటించారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అంబేద్కర్ చేసిన సేవలను చంద్రబాబు కొనియాడారు.
అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏపీ అంతటా ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్ జగన్తోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ భవన్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. అంబేద్కర్ చలువ వల్లనే తెలంగాణ ఏర్పడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారన్నారు. అంబేద్కర్ తత్వం నేటి భారతదేశానికి చాలా అవసరమన్నారు.
మరోవైపు పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ రాజు, గుప్తా అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులను రిమాండ్కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో మరో ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నారు.