ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఏ ఆటగాడి కోసం ఎక్కువ వెచ్చించాలన్న పక్కా ప్రణాళికతో వచ్చిన ఫ్రాంఛైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్ల వేలాన్ని కొన్ని సెట్లుగా విభజించారు. వందల మంది అందుబాటులో ఉన్నా 16 మందికే బీసీసీఐ మేటి ఆటగాళ్ల హోదాను కల్పించింది. వీరికి కనీస ధర రూ.2 కోట్లు. వారిలో మొదటి సెట్లో ఎనిమిది, రెండో సెట్లో ఎనిమిది మందిగా విభజించారు. మొదటి సెట్లో క్రిస్ గేల్ మినహా ఏడుగురు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. చిన్న విరామం అనంతరం రెండో సెట్ వేలం ప్రారంభమయింది. భారీ అంచనాలు పెట్టుకున్న భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్కు షాక్ తగిలింది. సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ను హైదరాబాద్ వదిలేసింది. అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అతడి ప్రారంభ ధర(రూ. 2 కోట్లు)కే దక్కించుకుంది.