తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తిని రాంప్రసాద్, సంధ్యారాణి తల్లి సావిత్రి, సోదరుడు సాయికుమార్లతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తండ్రి మరణిస్తే అతని స్థానంలో కుటుంబ బాధ్యత తీసుకున్న గొప్ప వ్యక్తిత్వం సంధ్యారాణిదని అలాంటి ఆమెపై సామాజిక మాధ్యమాలు అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు కార్తిక్కు వంత పాడుతూ తన బిడ్డపై అన్యాయమైన నిందలు వేస్తున్నారని తెలిపారు.
మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తిని రాంప్రసాద్ మాట్లాడుతూ మృతురాలిపై పెట్రోలు పోసి అంటించిన తర్వాత నిందితుడు తన తల్లితోనే మాట్లాడాడని, ఆమె ద్వారానే పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. అనంతరం ఆమె మృతురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కేసును తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటనలో కార్తిక్ సహా, అతని తల్లిని విచారించాలని డిమాండ్ చేశారు.