టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఐటీ అండ్ ఈడీ రైడ్స్తో ప్రమాదాన్ని ముందే ఊహించిన రేవంత్ కోస్గి బహిరంగ సభలో ఉద్వేగానికి లోనయ్యారు. రేవంత్రెడ్డి బయట ఉంటే 30వేలు జైలుకెళ్తే 50వేల మెజారిటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలు నుంచే నామినేషన్ దాఖలు చేస్తానన్న రేవంత్రెడ్డి తనను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనంటూ కొడంగల్ ప్రజలపై భారం వేశారు.
అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తా... లేకపోతే జైలు నుంచే నామినేషన్ వేస్తా... కోస్గి నుంచి హైదరాబాద్ బయల్దేరుతూ రేవంత్రెడ్డి అన్న మాటలివి... కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా హైదరాబాద్లోని తన నివాసాల్లో, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఐటీ అండ్ ఈడీ రైడ్స్ జరుగుతుండటంతో రేవంత్ ఉద్వేగానికి లోనయ్యారు. కోస్గి బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడారు. గతంలో 32రోజులు జైల్లో పెట్టారు ఇప్పుడు మీరు అండగా ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాద్ వెళ్తున్నాను ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే ఈ ఎన్నికల్లో ఇదే నా ఆఖరి ప్రసంగం కావొచ్చంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అరెస్ట్ చేస్తే జైలు నుంచే నామినేషన్ దాఖలు చేస్తానన్న రేవంత్రెడ్డి తనను 50వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనంటూ కొడంగల్ ప్రజలపై భారం వేశారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఏమీ చేయలేకే... ఐటీ దాడులు చేయించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. అంతేకాదు కేసీఆర్పై మరోసారి నిప్పులు చెరిగారు. జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టు... కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేవరకూ... నిద్రపోనని శపథం చేశారు.