రాహుల్ గాంధీ నుదుటన విభూది రాసుకుంటున్నాడు. తాను వీరశైవ భక్తున్నంటూ కొత్తగా మాట్లాడుతున్నాడు. స్వామిజీలతో ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. సోమ్నాథ్ టెంపుల్ ప్రత్యేక పూజలూ చేశాడు. అటు నరేంద్ర మోదీ కూడా రాహుల్, దేవాలయాల సందర్శనపై ఘాటుగానే మాట్లాడుతున్నారు. అంతేకాదు, కొందరు బీజేపీ నేతలు సోమ్నాథ్ టెంపుల్ నాన్ హిందూ రిజిస్టర్లో రాహుల్ సంతకం చేయడాన్ని పెద్ద వివాదమే చేస్తున్నారు. ఈ మతాల చుట్టూ, వ్యక్తిగత నమ్మకాల గురించి, చర్చ ఎక్కడ జరుగుతుందో తెలుసా...గుజరాత్ ఎన్నికల ప్రచారంలో...మరి ఎలక్షన్ క్యాంపెన్లో డిస్కషన్ జరగాల్సింది అభివృద్ది, ప్రజాసమస్యల గురించి కదా...ఇదేంటని అనుకుంటున్నారా....హిందూ ఓట్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ టగ్ ఆఫ్ వార్గా గుజరాత్ పోల్లో కుస్తీపడుతున్నాయా? ఎన్నికల ప్రచారం సాగుతున్న తీరును బట్టి ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పరస్పర విమర్శలు, ప్రతివిమర్శలతో గుజరాత్ ఎలక్షన్ క్యాంపెన్ తీరే మారిపోయింది. ఇప్పుడు తాజాగా వివాదాన్ని రాజేసిన అంశం, రాహుల్ గాంధీ సోమ్నాథ్ టెంపుల్ సందర్శన.
హిందువును కాదంటూ రిజిస్టర్లో రాహుల్ సంతకం?
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను తెగ తిరిగేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎప్పుడూలేనిది వరుసగా ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రఖ్యాత సోమ్నాథ్
రాహుల్ నాన్హిందూ ప్రకటనపై రాజుకున్న వివాదం.. నిబంధనల ప్రకారం హిందువులు కానివారు సోమ్నాథ్ దేవాలయాన్ని సందర్శించినపుడు, ఎంట్రీ రిజిస్టర్లో సంతకం చేయాలి. అది రూల్. అంటే తాను ఏ మతానికి చెందినవ్యక్తినో రిజిస్టర్లో సంతకం చేసి ప్రకటించుకోవాలి. కానీ రాహుల్ తాను హిందువుణ్ని కాదంటూ, నాన్ హిందూ రిజిస్టర్లో సంతకం చేయడం కాంట్రావర్సీని రాజేసింది.
గతంలో తాను హిందూ బ్రాహ్మణుడనని ప్రకటించుకున్న రాహుల్
గతంలో రాహుల్గాంధీ తాను హిందూ బ్రాహ్మణుడనని ప్రకటించారు. తాను భగవద్గీత చదువుతానని, శివభక్తుడినని చెప్పారు. తాజాగా ఆయన నాన్ హిందువునంటూ సంతకం చేయడంతో బీజేపీ ఆయనను వివరణ కోరింది. తాను హిందూ బ్రాహ్మణుడినని గతంలో ఎందుకు చెప్పారో వివరించాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి రాహుల్ గాంధీ కేథలిక్ అంటూ ఆరోపించారు.
అసలు సోమనాథ్ టెంపుల్ చరిత్ర రాహుల్కు తెలుసా-మోదీ
నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీ, సోమనాథ్ టెంపుల్ సందర్శనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నడూలేని భక్తి ప్రదర్శిస్తున్న రాహుల్ గాంధీకి, అసలు సోమనాథ్ టెంపుల్ చరిత్ర తెలుసా అంటూ ప్రశ్నించారు. రాహుల్ తాత, తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ సోమ్నాథ్ దేవాలయం పునరుద్ధరణను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ సర్దార్పటేల్ ముందుండి సోమ్నాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించారని, మొదటి నుంచి గుజరాత్పై కాంగ్రెస్కు సవతితల్లి ప్రేమేనని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే, రాహుల్ గాంధీ నాన్ హిందూ వివాదంపై కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. హిందూయేతరులకు ఉన్న విజిటర్స్ బుక్లో, రాహుల్ మీడియా కో-ఆర్డినేటర్ మనోజ్ త్యాగి తన పేరు రాశారని, తర్వాత రాహుల్ పేరును ఎవరో చేర్చారని కాంగ్రెస్ వాదించింది. ఆలయ ట్రస్టుకు ప్రధాని మోదీ ట్రస్టీగా ఉన్నారని, బీజేపీ నేతలే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది. రాహుల్ కేవలం విజిటర్స్ బుక్లో ఆ ప్రదేశాన్ని ‘ఇన్స్పైరింగ్’ గా ఉందని మాత్రమే రాశారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. రాహుల్ జంధ్యం వేసుకున్న నిజమైన హిందువు అని అన్నారు.
రాహుల్ తన మతంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్
అయితే, బీజేపీ నేతలు మాత్రం, రాహుల్ నాన్ హిందూ వివాదాన్ని ఏమాత్రం వదిలేలా లేరు. ఆయన ఏ మతాన్నైనా ఆచరించవచ్చని,. దాంతో తమకేమీ సమస్యలేదంటున్న కాషాయ నేతలు, కానీ, ప్రజల్ని గందరగోళానికి గురి చేయకుండా తన మతంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఒకలా, సోమ్నాథ్ టెంపుల్ విజిటర్స్ బుక్లో మరోలా మతాన్ని నమోదు చేయడం సరికాదన్నారు.
ఇదిలావుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారం గుళ్లూ, గోపురాలు చుట్టూ తిరుగుతోంది. వ్యక్తిగత దూషణలపర్వంగా సాగుతోంది. మొన్న హార్ధిక్ పటేల్ సెక్స్ టేపుల బాగోతం, నేడు రాహుల్ నాన్ హిందూ వివాదం. మరి ఈ చిచ్చును కావాలానే రగిలిస్తున్నారా...గుజరాత్ ఓటర్లను మతం ప్రాతిపదికన చీల్చే ప్రయత్నమా...రాహుల్ గుళ్లూ గోపురాల సందర్శనలో భక్తి ఉందా...వ్యూహముందా...రాహుల్ మతాన్ని ప్రశ్నించడంలో కాషాయ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఎన్నికల ప్రచారాన్ని దారి తప్పిస్తున్నది ఎవరు?