కర్నాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కోలార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్ధానిక సెంటిమెంట్ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారంటూ ప్రజలకు వివరించారు. దేశ చరిత్రలో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న ఘనత కర్నాటకదేనంటూ కొనియాడిన ఆయన కన్నడవాసులు తెలివైన నిర్ణయం తీసుకోవడంలో మందుంటారంటూ ప్రశంసించారు. గడచిన ఐదేళ్లలో కర్నాటకలో అవినీతి రాజ్యమేలిందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనకు సోనియా గాంధీ ప్రభువయితే ..తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రభువులంటూ ప్రజలకు వివరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బసవన్నగుడిలోని దొడ్డ గణపతి ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో పర్యటిస్తున్న ఆయన స్ధానికంగా ఉన్న దొడ్డ గణపతి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వరుసగా గుళ్లను సందర్శిస్తున్న రాహుల్ తాజాగా మరోసారి పూజలు నిర్వహించారు.