హైదరాబాద్ మరో అడుగు ముందుకేసింది. భాగ్యనగర చరిత్రలో మరో కీలక మైలురాయిని దాటింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రోరైల్ను ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోనున్న మోడీ.... అక్కడ్నుంచి హెలికాప్టర్లో మియాపూర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 45 నిమిషాలకు మియాపూర్ చేరుకుని... మెట్రోరైల్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించనున్నారు. అనంతరం మెట్రోరైల్లో మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తారు, తిరిగి అదే రైల్లో మియాపూర్ చేరుకుని, అక్కడ్నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీ వెళ్తారు.
బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు ఏడువేల మందితో స్వాగతం పలకనున్నారు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్లోనే రాష్ట్ర బీజేపీ నేతలతో మోడీ కొద్దిసేపు ముచ్చటించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో మియాపూర్ బయల్దేరి వెళ్తారు. మెట్రోరైల్ ప్రారంభం సందర్భంగా మియాపూర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.