కేసీఆర్ ప్రభుత్వం రద్దైనప్పటి నుంచి ఈ సారి అధికారంలోకొచ్చేది తామే అంటూ చెప్పుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడే ముందు కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తోంది. 80 కి పైగా స్థానాల్లో పాగా వేయబోతున్నామంటున్న ప్రజా కూటమి నాయకులు ఇక నాలుగు పార్టీలను ఒకే జట్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ప్రజాకూటమి ఒకే జట్టుగా చూడాలని దీనికై రాజ్యాంగ బద్దంగా చర్యలు తీసుకోవాలని ఇవాళ గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు కలిసి ప్రజా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే తామంతా కలిసి పోటీ చేసినందున తమ కూటమిని ఒకటిగా గుర్తించాలని గవర్నర్కు విన్నవించనున్నాయి. ఇదే అంశంపై ఆదివారం రాత్రి నాలుగు పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలు, ఫలితాలు వెలువడ్డాక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన దానికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిస్తారు. దీంతో ముందస్తుగా మేల్కొన్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ప్రజాకూటమిని ఒకజట్టుగా గుర్తించాలని గవర్నర్ను కోరనున్నాయి. కూటమిని ఓ జట్టుగా గుర్తిస్తే అప్పడు మెజార్టీ సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమనే అనుమతించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. అలాగే ముందస్తు వ్యూహంలో భాగంగా ప్రజా కూటమి ఇటు ఎంఐఎం, అటు స్వతంత్రులతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టింది. అంచనాల్లో తేడా వస్తే అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా వారితో మాట్లాడింది. ముఖ్యంగా ఏఏ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్న రెబల్స్తో కీలక నాయకులు మంతనాలు జరుపుతున్నారు.