మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధానికి తెరపడింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రేపు జరుగనున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు కీలకం కానున్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. తీవ్రంగా ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల భవిష్యత్ తేలనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా బుధవారం మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. ఈవీఎంలు పోలింగ్ బూత్లకు తరలుతున్నాయి.
ఇక మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ వంటి బడా నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే మెరుగైన పాలనను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుండగా.. కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం నుండి అధికార పక్షంలోకి వస్తామని ఆశతో ఉంది. మిజోరం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకుగాను 209 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వెయ్యీ 164 పోలింగ్ స్టేషన్లలో 7 లక్షల 68 వేల 181 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైట్రిక్ కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తుండగా.. మిజోరంలో ఎలాగైనా బోణీ కొడతామని బీజేపీ ధీమాగా ఉంది. 15 యేళ్లుగా మధ్యప్రదేశ్ను ఏలుతున్న బీజేపీ, గత పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిజోరం లో గత 10 రోజులుగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని తీవ్రంగా శ్రమించాయి. ఓటర్లకు హామీల వర్షం కురిపించాయి. అధికారం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశాయి.