జాతీయ స్ధాయిలో కీలక పాత్ర పోషించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాలపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా పార్టీ బాధ్యతలు కేటీఆర్కు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
పార్టీ సభ్యత్వ నమోదు, 31 జిల్లాల పరిధిలో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా పూర్తి స్ధాయిలో బలోపేతం చేసే బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. గత పదేళ్లుగా పార్టీలో నాలుగేళ్లుగా ప్రభుత్వంలో కేటీఆర్ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారన్న కేసీఆర్ కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత,నాయకత్వ లక్షణాలు టిఆర్ఎస్ను సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన సెమీఫైనల్లో బంపర్ విక్టరీ కేటీఆర్ కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయాన పార్టీలో అసంతృప్తులను చల్లార్చడంలోనూ, గ్రేటర్ పరిధిలో అత్యధిక స్ధానాలు రావడం వెనక కేటీఆర్ వ్యూహం ఉండటం వల్లే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినట్టు నేతలు చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ స్ధానాలను ఏక పక్షంగా కైవసం చేసుకోవడంలో కేటీఆర్దే కీలక పాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పార్టీలో తొలి సారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని స్పుష్టించి కేటీఆర్ను నియమించారు.