తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్రెడ్డి సెక్యూరిటీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతతో పాటు ఎస్కార్ట్ కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు భద్రత కల్పించాలని తేల్చిచెప్పింది.
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రేవంత్రెడ్డి సెక్యూరిటీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సవరించింది. రేవంత్ సెక్యూరిటీ బాధ్యత కేంద్రానిదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం వేసిన అప్పీల్ను అంగీకరించింది. రేవంత్కు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతతో పాటు ఎస్కార్ట్ కూడా కల్పించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది.
తనకు ప్రాణహాని ఉందని రేవంత్రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే తొలుత రేవంత్ పిటీషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం రేవంత్ భద్రత బాధ్యత కేంద్రానిదని ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై కేంద్ర హోంశాఖ హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. స్థానిక నాయకుల భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని రేవంత్కు కేంద్రం భద్రత కల్పించాలన్న ఉత్తర్వులను సవరించాలని అప్పీల్లో కోరింది. దీంతో హైకోర్ట్ డివిజన్ బెంచ్ కేంద్రం అప్పీల్ను అంగీకరించింది. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ రేవంత్ భద్రత బాధ్యత రాష్ట్రానిదే అని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు రేవంత్కు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.
ఇటీవల కూడా తన భద్రత విషయంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి తనను అంతమొందించే కుట్ర జరుగుతుందని చెప్పారు. తనను హత్య చేయించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇందుకు తెలంగాణ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ మద్దతు పలుకుతున్నారని ఎన్నికల ప్రచారంలో తనపై భౌతిక దాడి జరిగే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనపై దాడి చేయడానికి యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో పని చేసే పోలీసు అధికారుల్ని ప్రభుత్వం రంగంలోకి దించిందని రేవంత్ ఆరోపించారు.