కర్ణాటకలో సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ జేడీఎస్ ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పాలనా పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ , జేడీఎస్, కాంగ్రెస్ శాసన సభాపక్షాలు సమావేశం కాబోతున్నాయి. తర్వాత గవర్నర్తో సమావేశానికి ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. దీంతో ప్రభుత్వ పీఠంపై కూర్చునేది యడ్యూరప్పా.. కుమార స్వామా అనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక అసెంమబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా....జేడీఎస్కే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే...2017లో గోవాలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఏర్పడినా..రెండో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయాన్ని హస్తం నేతలు ఉదహరిస్తున్నారు. అతి పెద్ద పార్టీ అనే అంశం కంటే మెజారిటీ ఉంటే చాలని నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గవర్నర్కు అంద చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గోవాలో కాంగ్రెస్కు వర్తించినదే..ఇప్పుడు బీజేపీకి కూడా వర్తిపచేయాలని హస్తం నేతలు వాదిస్తున్నారు.
మరోవైపు ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం జరగబోతోంది. కుమార స్వామికి మద్దతిస్తున్నట్లుగా తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించి గవర్నర్కు అందచేస్తారు. అలాగే జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా కుమార స్వామిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఉదయం సమావేశం అవుతారు. యడ్యూరప్పను శాసనసభా పక్ష నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకొని ఫరేడ్గా రాజ్భవన్కు వెళ్తారు. గవర్నర్ భేటీ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్తారు. ప్రభుత్వ ఏర్పాటుకై ఎలా ముందుకెళ్లాలి,.? జేడీఎస్ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించాలి..? కాంగ్రెస్ను ఎలా ఎదుర్కొనాలనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పి గోడదూకుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్,బీజేపీ, జేడీఎస్ పార్టీలు అభ్యర్థులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రిసార్టులకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.