టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య 10 కోట్ల పంచాయతి ముదురుతోంది. నాయిని వ్యాఖ్యలను సుమోటగా తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే ఎప్పుడు జరిగిందో తెలుసుకోకుండా ఫిర్యాదులు చేస్తే ఎలాగంటూ టీఆర్ఎస్ చురకలు అంటిస్తోంది. టీఆర్ఎస్ నేత నాయినినర్సింహారెడ్డిపై సీఈవో రజత్కుమార్కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా నాయిని వ్యాఖ్యానించారని ఫిర్యాదు చేశారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని సీఈవోను రేవంత్ కోరారు. తనపై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఈసారి కొడంగల్లో ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను ముషీరాబాద్ ప్రెస్మీట్లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5, 10 లక్షలో కేసీఆర్ ఇస్తారన్నారనే బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.